Andhra Pradesh : ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వో), బీఎల్వో సూపర్వైజర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి వార్షిక పారితోషికాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2025 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం బీఎల్వోలకు వార్షికంగా రూ.12,000, బీఎల్వో సూపర్వైజర్లకు రూ.18,000 చెల్లించనున్నారు. సమ్మరీ రివిజన్ (SSR/SR) లేదా ఇతర ప్రత్యేక డ్రైవ్లలో పనిచేస్తే బీఎల్వోలకు అదనంగా రూ.2,000 ప్రత్యేక ప్రోత్సాహకం లభిస్తుంది. పూర్తి సంవత్సరం పనిచేస్తే పూర్తి పారితోషికం, కొంతకాలం మాత్రమే పనిచేస్తే ఆ కాలానికి అనుగుణంగా చెల్లింపు ఉంటుంది.
ఎన్నికల సంఘం సూచనల మేరకు తీసుకున్న ఈ నిర్ణయానికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర సీఈవో వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో బీఎల్వోలకు రూ.6,000, సూపర్వైజర్లకు రూ.12,000 మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఈ మొత్తాలను దాదాపు రెట్టింపు చేయడం విశేషం.

