Tuesday, December 16, 2025
HomeసినిమాPawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది. గత నెలలో మధురైలో జరిగిన మురుగన్ భక్తుల ఆధ్యాత్మిక సదస్సు (మురుగన్ భక్తర్గల్ ఆన్మీగ మానాడు)లో మద్రాస్ హైకోర్టు విధించిన ఆంక్షలను ఉల్లంఘించారని, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. పవన్‌తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై, హిందూ మున్నాని నాయకులు, సభ నిర్వాహకులపై కూడా చెన్నైలోని అన్నానగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది.

జూన్ 22న మధురైలో బీజేపీ తమిళనాడు యూనిట్, హిందూ మున్నానితో కలిసి నిర్వహించిన మురుగన్ భక్తుల సదస్సులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సభకు మద్రాస్ హైకోర్టు రాజకీయ, మతపరమైన ప్రసంగాలను నిషేధిస్తూ ఆంక్షలు విధించింది. అయితే, పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో “సెక్యులరిజం పేరుతో హిందూ దేవతలను కించపరిచే వారు ఉన్నారు. నేను క్రిస్టియానిటీ, ఇస్లాంను గౌరవిస్తాను, కానీ హిందూ ధర్మాన్ని అవమానించవద్దు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాయని ఆరోపిస్తూ చెన్నైకి చెందిన న్యాయవాది వాంజినాతన్ ఫిర్యాదు చేశారు.

సభలో హిందువులను ఓటు బ్యాంకుగా ఐక్యంగా ఓటు వేయాలని పిలుపునిచ్చినట్లు, డీఎంకే ప్రభుత్వాన్ని “ఆలయాలను ఆదాయ వనరులుగా ఉపయోగిస్తోంది” అని విమర్శించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలతో ఐపీసీ సెక్షన్లు 196(1)(a) (మతపరమైన విద్వేషం), 299 (మత భావనలను కించపరచడం), 302 (మత సామరస్యాన్ని భంగం చేయడం), 353(1)(b)(2) (సామాజిక శాంతిని భంగపరిచే చర్యలు) కింద కేసు నమోదైంది. ఈ కేసు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్, సనాతన ధర్మం పరిరక్షణ కోసం తమిళనాడులో బీజేపీ నేతలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంలో డీఎంకే నేతలు పవన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular