Tuesday, December 16, 2025
Homeలేటెస్ట్ న్యూస్Pension : పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త.. ఇకపై ఆ సమస్యలకు చెక్..

Pension : పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త.. ఇకపై ఆ సమస్యలకు చెక్..

Pension : తెలంగాణ ప్రభుత్వం “చేయూత” పథకం కింద 44 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, హెచ్‌ఐవీ, డయాలసిస్ బాధితులకు పెన్షన్లు అందిస్తోంది. ప్రస్తుతం వేలిముద్రల ఆధారంగా పెన్షన్ల పంపిణీ జరుగుతుండగా, వృద్ధుల వేలిముద్రలు అరిగిపోవడం వంటి సమస్యలతో డబ్బులు డ్రా చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది, దీనితో పెన్షన్ పంపిణీ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారనుంది.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ కొత్త వ్యవస్థను వెంటనే అమల్లోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మొదటి దశలో పోస్టాఫీసు ద్వారా పెన్షన్ పొందే 23 లక్షల మందికి ఈ విధానాన్ని వర్తింపజేయనున్నారు. ఈనెల 29న రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని భావించినప్పటికీ, సాంకేతిక సమస్యల కారణంగా ఆ తేదీ ఖరారు కాలేదు, త్వరలో కొత్త తేదీని ప్రకటించనున్నారు.

ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో, పోస్టాఫీసుకు వచ్చిన వారి ఫొటో తీసి ఆధార్‌లోని ఫొటోతో సరిపోల్చి, యాప్‌లో అప్‌లోడ్ చేసి పెన్షన్ చెల్లిస్తారు. ఫొటో తీయలేని పరిస్థితుల్లో బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగిస్తారు. ఈ రెండు విధానాలూ పనిచేయని వారికి గ్రామ కార్యదర్శులు వేలిముద్రల ద్వారా పెన్షన్ అందజేస్తారు. ఈ కొత్త విధానం ద్వారా పెన్షన్ పంపిణీలో ఇబ్బందులను తగ్గించి, సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

RELATED ARTICLES

Most Popular