Telangana heavy Rain : దిత్వాహ్ తుపాను ప్రభావం తెలంగాణపై స్వల్పంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం-శ్రీలంక తీరంలో ఏర్పడిన ఈ తుపాను ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారి, సోమవారం ఉదయం సాధారణ వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. తుపాను కారణంగా సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని దక్షిణ మరియు తూర్పు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇదే సమయంలో తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. చాలా ప్రాంతాల్లో గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. ఖమ్మంలో గరిష్టంగా 30.2° సెల్సియస్, ఆదిలాబాద్లో కనిష్టంగా 8.2° సెల్సియస్ నమోదైంది. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

