Telangana Weather Update : తెలంగాణలో ఇప్పటికే చలి పంజా విసురుతోంది. ఉదయం-సాయంత్రం బయటకు అడుగుపెట్టాలంటే ప్రజలు వణికిపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే పది రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగి, రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతాయని, కొన్ని చోట్ల 5 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే చలి దంచికొట్టేస్తోంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో గత రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీల మేర రికార్డు అయింది. సిర్పూర్లో 10.4°C, సాత్నాలలో 10.8°C, నిర్మల్ జిల్లా పెంబిలో 12.7°C నమోదైంది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, పెద్దపల్లి, మెదక్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో 13 నుంచి 13.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం – డిసెంబర్ 7 నుంచి 17 వరకు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లోనే నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ముందుగా ఉత్తర తెలంగాణ జిల్లాలు (అదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం, కామారెడ్డి మొ.) ఈ చలి పంజాకు గురవుతాయి. ఆ తర్వాత దక్షిణ తెలంగాణ జిల్లాలు కూడా సింగిల్ డిజిట్ టెంపరేచర్ను ఎదుర్కొననున్నాయి.
నగరవాసులకు కూడా గుడ్ న్యూస్ లేదు. ఆదివారం (డిసెంబర్ 7) నుంచి రాబోయే 10 రోజుల పాటు హైదరాబాద్లో రాత్రి ఉష్ణోగ్రత 5 నుంచి 8 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
చేవెళ్ల, మొయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్ – 5°C నుంచి 8°C
హెచ్సీయూ, శేరిలింగంపల్లి, నానక్రామ్గూడ – 6°C నుంచి 8°C

