Virat Kohli : టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ మరోసారి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు గెలుచుకున్న తొలి క్రికెటర్గా ఆల్టైమ్ రికార్డు నమోదు చేశాడు. భారత్–దక్షిణాఫ్రికా మధ్య ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకోవడంతో కోహ్లీ ఈ అపూర్వ ఘనత సాధించాడు.
ఈ అవార్డుతో కోహ్లీ సొంతం చేసుకున్న ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుల సంఖ్య 20కు చేరింది. ఈ రికార్డును ఇప్పటివరకు ఆయన అభిమాన క్రికెటర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో కలిసి సంయుక్తంగా పంచుకున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లీ… సచిన్ రికార్డును బద్దలుకొట్టి ఒంటరిగా అగ్రస్థానంలో నిలిచాడు.
దక్షిణాఫ్రికాతో సిరీస్లో కోహ్లీ 3 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో కలిపి 302 పరుగులు రాబట్టాడు. అత్యధిక స్కోరు 121 నాటౌట్. ఈ అద్భుత ఫామ్తోనే భారత్ సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు :
- విరాట్ కోహ్లీ (భారత్) – 20
- సచిన్ టెండూల్కర్ (భారత్) – 19
- షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 17
- జాక్వెస్ కాలిస్ (దక్షిణాఫ్రికా) – 14
- సనత్ జయసూర్య (శ్రీలంక), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 13 చొప్పున
ప్రస్తుత ఆటగాళ్లలో ఎవరూ ఇంకా 10 అవార్డుల స్థాయికి కూడా చేరుకోలేదు. కాబట్టి కోహ్లీ సాధించిన 20 అవార్డుల రికార్డు భవిష్యత్తులో బద్దలు కావడం అంత సులువైన విషయం కాదని నిపుణుల అభిప్రాయం.
వన్డేల్లోనూ దూసుకుపోతున్న కోహ్లీ :
వన్డే ఫార్మాట్లోనూ కోహ్లీ ఈ అవార్డుతో 11వ సారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్యతో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 14 అవార్డులతో ఇప్పటికీ వన్డేల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

